తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయానికి ఇక తెరపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీఎం ఎవరనే విషయానికి హస్తం పార్టీ అధిష్ఠానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీస్డేడియం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్న రేవంత్రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు. సోనియా, రాహుల్ గాంధీని కలవనున్నారు. సీఎంగా ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. కేబినెట్ కూర్పుపై చర్చిస్తారని తెలుస్తోంది. సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే హైకమాండ్ చెప్పింది. డిప్యూటీ సీఎంల విషయంలోను హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలో చర్చించనున్నారు.
సీఎంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ధన్యవాదాలు చెప్పారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి నేతలను ఆహ్వానించనున్నారు.
అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. డిసెంబర్ 7న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలోనే తెలంగాణ సీఎంగా రేవంత్ పేరును ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. సోమవారమే దీనిపై ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్ఠానానికి అందించారు. సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్ను సీఎంగా ఎంపిక చేశారు..