Jofra Archer : ఇంగ్లాండ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా వెళ్లి ఘోర పరాభవం మూటగట్టుకు వచ్చింది. దీంతో ఇంగ్లండ్ పరువు పోవడమేకాదు, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పరువు కూడా పోయింది. సరే జరిగిందేదో జరిగిపోయింది, ముందు జరగాల్సినదేదో చూద్దామనే మానసిక స్థితికి బోర్డు వెళ్లింది.
అంతేగానీ పాకిస్తాన్, శ్రీలంక తరహాలో రచ్చ రచ్చ చేసుకోలేదు. జెంటిల్మెన్ క్రీడ పుట్టిందే ఇంగ్లండ్ లో… అందుకని ఆ మాటకి వన్నెతెచ్చేలా వాళ్లు హుందాగానే వ్యవహరించారు. ఓటమిని కూడా పాజిటివ్ గా నే తీసుకున్నారు, కానీ కొన్ని మార్పులు-చేర్పులపై ద్రష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ వాడిని ఐపీఎల్ లో ఆడొద్దని సూచించింది.
విషయం ఏమిటంటే పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రత్యర్థులను భయపెడతాడు. అలాగే బ్యాటుతో కూడా రాణించగలడు. అంటే ఆలౌరౌండర్ గా ఉపయోగపడతాడు. అందుకే ముంబయి ఇండియన్స్ ఏకంగా రూ. 8 కోట్లకు దక్కించుకుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో గాయపడి ప్రొఫెషనల్ క్రికెట్కు దూరమయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా ముంబయి జట్టులోకి వెళ్లడంతో ఆర్చర్ ని వదిలించుకుంది.
దీంతో అతనికి రాబోవు వేలంలో మంచి ధర పలుకుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఏం చేసిందంటే, ఆర్చర్ ని ఐపీఎల్ లో ఆడొద్దని సూచించింది. దాంతో తను ఐపీఎల్ వేలంలో పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు.
ఇలా చేయడం వెనుక ఇంగ్లండ్ బోర్డు వ్యూహాత్మక వైఖరి కనిపిస్తోంది. ఏప్రిల్, మే లో తమ పర్యవేక్షణలో ఆర్చర్ ఉంటే త్వరగా కోలుకుంటాడని ఈసీబీ భావిస్తోంది.
ఎందుకంటే టీ 20 వరల్డ్ కప్ నకు అతన్ని సిద్ధం చేయాలని భావిస్తోంది.
గతంలో బీసీసీఐ బుమ్రా విషయంలోనే ఇదే తరహా జాగ్రత్తలు పాటించింది. పనిభారం, గాయాల బారిన పడకూడదని దగ్గర పెట్టుకుంది. నేరుగా బుమ్రాను ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేసి, అట్నుంచి అలా వన్డే వరల్డ్కప్ 2023లో బరిలోకి దించారు.
బూమ్రా గురించి బీసీసీఐ తీసుకున్న జాగర్తల బాటలోనే ఈసీబీ కూడా వెళుతోంది. ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై ఎంతటి నిఘా పెట్టారో అర్థమవుతోంది. దీనిని మంచి పరిణామంగానే భావించాలని సీనియర్లు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచ క్లాస్ క్రికెట్ ని బీసీసీఐ అందిస్తుందని చెప్పాలని అంటున్నారు.