మిగ్జాం తుపాను తీరం దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటిన ‘మిగ్జాం’ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు రెండు మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
తుపాను ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరుగుతోంది. రాయలసీమలోనూ తుపాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.