తెలంగాణ ప్రజలు అణచివేతను సహించరని.. అందుకే కేసీఆర్ ఓడిపోయారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆనాడు నిజాం.. తెలంగాణ ప్రజల్ని అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం కూడా అణిచివేత వల్లే పుట్టిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళనలు చేసే స్వేచ్ఛ అయినా ఉండేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ఆ స్వేచ్ఛ కూడా లేదని కూనంనేని పేర్కొన్నారు. నిర్బంధాలను తెలంగాణ అంగీకరించదు అనేది మొన్నటి తీర్పు స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని.. అణచివేత లేకుండా కాంగ్రెస్ పాలన జరగాలని కూనంనేని సూచించారు. కాంగ్రెస్ కమ్యునిస్టుల పొత్తు కలిసి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న ప్రతీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ఒక్క కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో ఉండాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. తన గెలుపులో అందరి సహకారం ఉందని అన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ లో గతంలో ఎప్పుడూ రాని మెజారిటీ వచ్చిందని తెలిపారు. కమ్యూనిస్ట్ గొంతును అసెంబ్లీ లో వినిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.
.
.