తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హస్తిన వేదికగా కీలక భేటీలు జరుగుతున్నాయి. ఢిల్లీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తనకు ఆమోదమేనన్నారు.
ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. సీఎం అభ్యర్థి ఎంపిక తోపాటు కేబినెట్ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
డీకేతో చర్చల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తానన్నారు. అలాగే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన కూడా ఎంపీ పదవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.