ACB Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది.
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారణ చేయాలని సీఐడీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. చంద్రబాబు బెయిల్పై ఉన్నందున పీటీ వారెంట్లు తోసిపుచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఆరోగ్య కారణాల రీత్యా తొలుత మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు. హైదరాబాద్ వెళ్లి కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ ను కూడా పొందారు. ఆరోగ్యం కోలుకోవడంతో ప్రస్తుతం తీర్థ యాత్రలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఆ తర్వాత బెజవాడ దుర్గమ్మ సేవలోనూ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. తీర్థయాత్రలు పూర్తైన తర్వాత.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.