మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాతికేళ్ల యువతి విగతజీవిగా.. సగం కాలిన శరీరంతో రోడ్డుపక్కన కనిపించింది. ఈ ఘటన చేగుంట మండలం వడియారం సమీపంలో జరిగింది. స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహం హైదరాబాద్ కు వెళ్లే రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు.
పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పటించినట్లు అక్కడ ఉన్న అనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు. మృతురాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు. మృతురాలి గుర్తు తెలిసిన వ్యక్తులు, బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసు స్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.