MS Dhoni : మనుషులు మాట్లాడుకునే భాషలాగే క్రికెట్ కి కూడా ఒక భాషనేది ఉంది. కాకపోతే దానిని సైగల ద్వారా సందేశాలు పంపిస్తుంటారు. ముఖ్యంగా క్రీజులో ఉన్న వాళ్లకి ఏం కావాలన్నా బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు తీసుకురావల్సి ఉంటుంది. హెల్మెట్, బ్యాట్, మంచినీళ్లు, ప్యాడ్స్ ఇలా ఏది కావాలన్నా, సిగ్నల్స్ వెళతాయి. ఇటు నుంచి వెళ్లే సందేశాల్లేగా, అటు నుంచి అంటే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా వీరికి సంకేతాలు వస్తుంటాయి.
ఇవి కాకుండా సెంచరీ చేసిన బ్యాటర్లు ఆకాశం వైపు చూడటం, ఆ దేవునికి కృతజ్ఞత చెప్పుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. మొదటిసారి దీనిని సచిన్ టెండూల్కర్ ప్రారంభించాడని అంటారు. ఎందుకంటే సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ 1999 మే 19న మరణించాడు. అప్పుడు సరిగ్గా సచిన్ ఇంగ్లండ్ లో వరల్డ్ కప్ 1999 ఆడుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఇండియా వచ్చాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ బాధని గుండెల్లోనే పెట్టుకుని తిరిగి ఇంగ్లండ్ బయలుదేరాడు.
మే 23న కెన్యాతో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. 140 పరుగులు చేసి, అప్పుడు ఆకాశం వైపు చూసి ఆ సెంచరీని తండ్రికి అంకితం చేశాడు. ఇది ఆనాడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి అందరూ ఆకాశం వైపు చూడటం మొదలుపెట్టారు. అందరూ దేవుడికే కాదు, కొందరు తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పేవాళ్లున్నారు, ప్రేయసి, భార్యామణి, అప్పుడే పుట్టిన పిల్లలు ఇలా చాలా చాలా ఆకాశంవైపు చూసే విధానంలో ఉన్నాయి. అలాగే తాజాగా వరల్డ్ కప్ 2023లో 50వ సెంచరీ చేసిన కోహ్లీ.. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ కి అంకితం ఇవ్వడం విశేషం.
ఇదంతా ఎందుకంటే ఆస్ట్రేలియాతో టీ20 ఐదు మ్యాచ్ ల సిరీస్ ని 4-1 తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ట్రోఫీ అందుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. టీమ్ వద్దకు వెళ్లాడు. జట్టులో యువ ఆటగాళ్లు ఎవరున్నారో వారికి ట్రోఫీని అందించాడు. ఆ అదృష్టవంతులు ఎవరో కాదు.. జితేశ్ శర్మ, రింకూ సింగ్.. వారు ట్రోఫీని అందుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది ఎవరో కాదు, ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం టైటిల్ తీసుకెళ్లి జట్టులోని యువ ఆటగాళ్లకు ధోనీ అందజేశాడు. అప్పటి నుంచి ప్రతీ కెప్టెన్ ఇలాగే చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. తాజాగా సూర్య కూడా కొనసాగించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.