తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సింగరేణి కాలరీస్ కార్మికసంఘాల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు.. సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో సోమవారం సమావేశమయ్యారు.
అక్టోబరులోనే సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి నామినేషన్లను స్వీకరించి, ఎన్నికల చిహ్నాల కేటాయింపులు కూడా జరుగగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు సూచించింది. 3 నెలల క్రితం తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
తాజాగా ఓటర్ల జాబితాను.. శ్రీనివాసులు కార్మిక నేతలకు అందజేశారు. ఈ జాబితా ప్రకారం.. మొత్తం 39,991 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 6వ తేదీ లోగా చెప్పాలని, 7న అభ్యంతరాల పరిశీలన, 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు రిటర్నింగ్ అధికారి షెడ్యూల్ జారీ చేశారు. డిసెంబర్ 27 వరకూ సింగరేణి కాలరీస్ ఉద్యోగాలుగా రికార్డుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకే ఓటు హక్కు కల్పిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.