తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా కొలిక్కిరాకపోవడంతో హస్తినలో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ను మట్టికరింపించి విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం సీటు సహా కీలక పదవులకు కోసం ఎదురు చూస్తున్నారు. సోనియమ్మ మనసులో ఏముందన్నటెన్షన్లో ఉన్నారు. సీఎం పీఠం రేవంత్కు కేటాయించినట్టు తెలుస్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయేసరికి ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో పలు దఫాలుగా చర్చలు సాగిస్తున్న నేతలు హస్తినలో మకాం వేశారు.
సోమవారం నాడే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జగడంతో అంతా అదే ఊహించారు. అందుకోసం రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయేసరికి సీఎం ఎవరన్నదానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. మరోపక్క సీఎం పదవి కోసం సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టుబడుతుండటంతో గత ఆదివారం నుంచి ఈ వ్యవహారంపై చర్చలు సాగుతున్నాయి. అయితే.. మెజార్టీ ఎమ్మెల్యేలంతా రేవంత్ వైపు మొగ్గు చూపగా.. అధిష్టానం మనసులోనూ అదే ఉండటంతో ఇవాళ సీఎంగా రేవంత్ పేరును ప్రకటించే అవకాశముంది.
ఇక నేడు కూడా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనుంది అధిష్టానం. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. డీకేతోపాటు తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే మరో ముగ్గురు పరిశీలకులు మంతనాలు జరుపనున్నారు. డీకే బృందం ఇచ్చే నివేదిక, ఫీడ్బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించనుంది.