Bangladesh vs India match prediction(Sports news headlines): టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో టీమ్ ఇండియా తన రెండో మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆంటిగ్వాలో జరగనున్న మ్యాచ్ గానీ గెలిస్తే, టీమ్ ఇండియా నేరుగా సెమీఫైనల్ కి చేరే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో ఇక గెలుపు- ఓటములతో సంబంధం లేకుండా ధీమాగా సెమీస్ లో అడుగుపెట్టనుంది.
అయితే సూపర్ 8 తొలిమ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన బంగ్లాదేశ్ కి మాత్రం ఇది చావో రేవో మ్యాచ్ గా మారిపోయింది.
ఎందుకంటే ఇక్కడ ఇండియాను కొడితేనే తను రేస్ లోకి వస్తుంది. లేదంటే ఇటు నుంచి ఇటే…ఇంటికి వెళ్లిపోతుంది. అందుకని తమ శర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధ పడనుంది. అందుకని బంగ్లాదేశ్ తో తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు.
టీమ్ ఇండియాలో సూపర్ హీరోలు, భారీ అంచనాలున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ ఈ మ్యాచ్ లో విజృంభించాలని కోరుకుంటున్నారు. నిజానికి టీ 20 ప్రపంచకప్ నకు వీరిద్దరిని ఎంపిక చేయలేక, చేస్తే ఎలా ఆడతారో అర్థం కాక చాలాకాలం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు ఆలోచించారు.
Also Read : కోహ్లీ వరల్డ్ రికార్డ్ సమం చేసిన సూర్యకుమార్
చివరికి విధి లేని పరిస్థితుల్లో ఇద్దరితో మాట్లాడి మరీ ఎంపిక చేశారు. సెలక్షన్ కమిటీ ఏదైతే ఆందోళన చెందిందో.. అదిక్కడ కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరూ టీ 20 ఫార్మాట్ కి తగినట్టు ఆడలేక అవస్థలు పడటం టీమ్ మేనేజ్మెంట్ ని గందరగోళంలో పడేస్తోంది.
ఇప్పుడు వీరిద్దరూ టచ్ లోకి రావడం అనివార్యంగా మారింది. ఎంతసేపు పంత్, సూర్యాపై ఆధారపడతారని అప్పుడే నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతదూరం వచ్చామంటే బౌలర్ల దయవల్లే వచ్చామని అంటున్నారు. నిజానికి వీరిద్దరూ ఒకవైపు, 9 మంది జట్టు ఒకవైపు అన్నట్టుగా ఉంది.
ఈ మ్యాచ్ లోనైనా వీరు టచ్ లోకి వచ్చి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల్లో తమ ప్రతాపాన్ని చూపించాలని కోరుకుంటున్నారు. శివమ్ దుబెను తప్పించి సంజూ శాంసన్ లేదా యశస్విని తీసుకురావాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
Also Read : ఆ టైమ్ లో.. బబుల్ గమ్ గట్టిగా నమిలా: సూర్యకుమార్
బంగ్లాదేశ్ లో కెప్టెన్ షాంటో, షకీబ్ ఆల్ హసన్, మహ్మదుల్లా, లిటన్ దాస్, తౌహిద్, ముస్తాఫిజుర్ వీళ్లలో ఒక్కరు క్లిక్ అయినా చాలు, మ్యాచ్ చేజారిపోతుంది. వీరి మధ్య భాగస్వామ్యాలు రాకుండా చూడాలి. స్పిన్ తిప్పగలిగితే…వీరిని కంట్రోల్ చేయవచ్చునని అంటున్నారు.
ఆంటిగ్వా పిచ్ ని అంచనా వేయలేమని అంటున్నారు. లీగ్ మ్యాచ్ ల్లో బౌలింగునకు అనుకూలంగా ఉండి, తీరా సూపర్ 8కి వచ్చేసరికి బ్యాటర్లకు సహకరిస్తోంది. ఎప్పుడెలా స్పందిస్తుందో తెలియని పిచ్ పై ఆడటం ఇరుజట్లకు ఇబ్బందికరమే అంటున్నారు.
టీమ్ ఇండియా- బంగ్లాదేశ్ మధ్య ఇంతవరకు 13 టీ 20 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఒక్కదాంట్లో మాత్రమే బంగ్లా విజయం సాధించింది. లెక్కలు చూస్తే బాగానే ఉన్నాయి. మరి గ్రౌండులో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.