Sanjay Raut Comments: కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు దీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. అయితే, లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆ పదవి ఏ పార్టీ వారిని వరించనున్నదో అంటూ భారీగా చర్చ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి శివసేన(యూబీటీ) పార్టీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై భారీ చర్చ నడుస్తోంది.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి భారీగా సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. కానీ, సాధ్యం కాలేదు. అయితే, మోదీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు దీరింది. ఎన్డీయే కూటమిలో టీడీపీ రెండో ప్రధాన పార్టీగా ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీకి బీజేపీ రెండు కేంద్ర మంత్రి పదవులను కేటాయించింది. మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, తాజాగా ఇండియా కూటమికి చెందిన శివసేన (యూబీటీ) పార్టీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన అభ్యర్థిని లోక్ సభ స్పీకర్ గా బరిలో నిలిపితే తాము మద్దతిస్తామంటూ ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయని కూడా ఆయన తెలిపారు.
2014, 2019 ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. అందుకే ఎన్డీయే పక్ష పార్టీలకు లోక్ సభ స్పీకర్ పదవి అతి ముఖ్యమైనదన్నారు. స్పీకర్ పదవిని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి(పాశ్వాన్) పార్టీలకు ఇవ్వకుంటే ఆ పార్టీలను చీల్చే అవకాశం కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
లోక్ సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని టీడీపీ నేత చంద్రబాబు బీజేపీ పెద్దలను కోరినట్లు తమకు తెలిసిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు డిమాండ్ కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్దమంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తెలితే.. దోషులపై కఠిన చర్యలు: ధర్మేంద్ర ప్రధాన్
ఇదిలా ఉంటే.. కేబినెట్ లోని కొన్ని కీలక శాఖలతోపాటు లోక్ సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకుంటామని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్టీలకు బీజేపీ పెద్దలు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అంగీకరించినట్లు సమాచారం.