Varun Tej Making a New Movie with Director Merlapaka Gandhi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా హిట్ కాకపోయినా నిరాశపడకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వరుణ్ కెరీర్ లో సుమారుగా 14 సినిమాలు చేయగా.. వాటిలో బాగా హిట్టైనవి మూడే మూడు సినిమాలు. తొలిప్రేమ, ఫిదా, F2. గద్దలకొండ గణేష్ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. కంచెలో వరుణ్ నటన బాగున్నా.. ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. గని, గాండీవధారి అర్జున సినిమాలైతే విసుగు తెప్పించాయి. ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఫెయిల్ అయింది.
ప్రస్తుతం వరుణ్ చేతిలో ఒక సినిమా ఉంది. అదే మట్కా. ఈ సినిమాతో హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు మెగా ప్రిన్స్. పలాస 1978 సినిమా దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రజని తాళ్లూరి, తీగల కృపాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: వరుణ్ బాబుకు మరో లవ్ ట్రాక్ కుదిరింది వరుణ్ తేజ్.. ఈసారైనా హిట్ కొట్టేనా?
కాగా.. తాజాగా వరుణ్ తేజ్ తర్వాతి సినిమా అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక క్రైమ్ అండ్ కామెడీ కథ విన్న వరుణ్ తేజ్ దానికి ఓకే చెప్పినట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాలు తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. వరుణ్ కోసం ఒక క్రైమ్ కామెడీ కథను సిద్ధం చేశారట. ఆ స్టోరీ వరుణ్ కు నచ్చడంతో.. దానికి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. పైగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే. దీనికంటే ముందు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ ఒక లవ్ స్టోరీ చెప్పగా దానికి కూడా వరుణ్ ఓకే చెప్పినట్లు టాక్ వచ్చింది. మరి వరుణ్ తేజ్ వరుస సినిమాలను లైన్లో పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.