Attempt Made To Derail Train By Placing LPG Cylinder On Tracks In Kanpur: రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పరిధిలో ఉన్న అన్వర్ గంజ్-కాస్ గంజ్ మార్గంలో కొందరు గుర్తు తెలియని దుండగుుల రైల్వే ట్రాక్ పై ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్ ఉంచారు. ఆ దారిలో వస్తున్న కాళింది ఎక్స్ ప్రెస్ ను టార్గెట్ గా చేసుకున్న దుండగులు ట్రాక్ పై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్ ను ఉంచారు అయితే కాళింది ఎక్స్ ప్రెస్ బర్రారాజ్ పూర్ రైల్వే స్టేషన్ దాటి రెండున్నర కిలోమీటర్ల దూరం లో అమర్చిన ఎల్పీజీ గ్యాల్ సిలిండర్ ను అత్యంత వేగంగా వచ్చి ఢీకొంది. దీనితో రైలు వేగం ధాటికి ఎల్పీజీ సిలిండర్ పక్కనే ఉన్న పొదలపై భారీ విస్ఫోటనంతో పడింది. అయితే సమయస్ఫూర్తితో లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద సంఘటన గురించి రైల్వే పోలీస్ ఫోర్స్, జీఆర్పీ బృందాలు సమాచారం అందుకుని వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. రైల్వే పోలీసు బృందాలు అక్కడి వచ్చి ప్రాధమిక పరిశీలన చేశారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ మామూలుది కాదు..ఇందులోనే అగ్గిపుల్లలు, ఇతర పేలుడు పదార్థాలు కూడా ఉండటం గమనించారు పోలీసులు.
కుట్ర కోణం
దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ ఇప్పటికే ప్రారంభమయింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలు ఇంటెలిజెన్స్ బ్యూరో కి అప్పగించారు. గతంలోనూ ఇలాంటి తరహా పేలుడు కుట్రలు కొన్ని ప్రాంతాలలో జరిగాయని..లోకో పైలట్ అప్రమత్తంగా ఉండి ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడు పదార్థాలపై నుండి రైలు వెళ్లినట్లయితే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు. కొందరు ఆకతాయిలు పనిగట్టుకుని ఇలాంటి తరహా పనులను చేస్తున్నారని..వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు పట్టాలపై కనిపిస్తే రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ సంఘటనతో కాళింది ఎక్స్ ప్రెస్ ను దాదాపు 20 నిమిషాలకు పైగా నిలిపివేశారు. తర్వాత ట్రాక్ ని క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీ అధికారులు. అన్నీ సవ్యంగా జరిగాకే రైలును ముందుకు కదిలేందుకు అనుమతించారు.
ప్రయాణికుల ఆందోళన
రైలు ప్రమాదం కుట్ర సంగతి తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండబట్టి తమ ప్రాణాలు రక్షించుకోగలిగామని..ఏ మాత్రం అటో ఇటో అయితే ఈ పాటికి రెండుమూడుభోగీలు ధ్వంసం అయివుండేవని ప్రయాణికులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది తప్పకుండా టెర్రరిస్టుల చర్యే అని దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందని అంటున్నారు. అయితే రైల్వే పోలీసులతో దర్యాప్తు చేసి చేతులు దులుపుకోవడం కాదు..కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా సంఘటన ప్రదేశానికి వచ్చి కుట్ర కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని అంతా కోరుతున్నారు.