TDP Parliamentary Party Leader: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం సీఎం అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఖరారు చేయడంతో.. అభిమానులు పల్నాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు.
గుంటూరులో ఉన్న విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య కుమారుడే లావు శ్రీకృష్ణదేవరాయలు. 1983 ఏప్రిల్ 23న జన్మించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. ఆస్ట్రేలియాలో మీడియా స్టడీస్ చేశారు. 2014లో శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో వైసీపీలో చేరి.. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై పోటీ చేసి 1,53,978 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు.
Also Read: వైసీపీ భవిష్యత్కు ప్రమాదకరంగా జగన్ తీరు
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం.. లావు ను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించడంతో.. జనవరి 23న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. మార్చి 2న చంద్రబాబునాయుడి సమక్షంలో టీడీపీలో చేరి.. ఆ పార్టీ నుంచి మళ్లీ నరసాపురం ఎంపీగానే పోటీ చేసి విజయం సాధించారు. కాగా.. 2019-24 వరకూ ఎంపీగా ఉన్న కాలంలో వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో కృషి చేశారు. అలాగే రూ.10.61 కోట్ల వ్యయంతో నకరికల్లు మండలంలో ఇండో – ఇజ్రాయెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. మూడువేలకోట్ల వ్యయంతో జిల్లాలోని పలు జాతీయ రహదారుల్ని మంజూరు చేయించారు. వాటిలో కొన్ని రోడ్ల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు కూడా మంజూరు చేయించగా.. వాటి నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది.