Huge change in Governance after Chandrababu Naidu assumes as CM of AP: అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తన పాలనలో మార్పును చూపిస్తామని ప్రచారం చేస్తూ అందరూ అధికారంలోకి వస్తారు. ఏపీలో కూడా అదే జరిగింది. గత ఐదేళ్లలో జగన్ బటన్ల నొక్కడం తప్పా చేసిందేమీ లేదని కూటమి నేతలు ప్రచారం చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామని చెప్పారు. దీన్ని నమ్మిన ఓటర్లు కూటమికి అధికారం కట్టబెట్టారు. ఇప్పటి వరకు అయితే.. ఆ మార్పును చూపించే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారు.
శాఖవారీగా మంత్రు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రి లోకేష్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, వైద్య శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. విశాఖను ఐటీ హబ్ చేసేందుకు అధికారుల నుంచి సలహాలు సూచనలు కోరారు. కంపెనీలు రావడానికి మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ మంచి నిబంధలను పెట్టాలని ఆదేశించారు. ఇక తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. స్కూల్లు, కాలేజీల్లో మౌళిక సదుపాయాలు పెంచాలని అధికారులకు సూచించారు.
హోంశాఖ మంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానని చెప్పారు. అధికారులతో సమావేశమయ్యారు. గత ఐదేళ్లలో గంజాయి ఏపీలో పెద్ద సమస్యగా మారింది. కానీ.. దాన్ని పూర్తిగా పెకలించేందుకు మంత్రి అనిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే దీనిపై మీడియా సమావేశం కూడా నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ గోదాములను తనిఖీ చేశారు. గత హయాంలో జరిగిన అవినీతిని కూడా బయటపెట్టారు. ఇక వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇక వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రారంభించారు. ఇలా మంత్రలు సమీక్షలు నిర్వహించడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు.
Also Read: వైసీపీ విలీనమవుతుందా? ఇంకిపోతుందా?
అయితే, గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఏ శాఖకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించాలన్నా.. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే. మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి సజ్జలే అన్ అఫీషియల్ గా అన్ని శాఖల బాధ్యతలు చూసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఏదైనా శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తే సజ్జల రామకృష్టారెడ్డే మాట్లాడేవారు. కరోనా టైంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఎవరో చాలా మందికి తెలియదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక, మంత్రులు విపక్షాలను బూతులు తిట్టడానికి మాత్రమే ప్రెస్మీట్లు పెట్టేవారు. ఆ బూతులే వైసీపీని అధికారానికి దూరం చేశాయని ఓ విశ్లేషణ.
అయితే.. కూటమి అధికారంలో ఆ పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు మంత్రులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇదే తీరు కనిపిస్తోంది. ఫలితాలు రావడంతోనే పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. కక్ష సాధింపులకు సమయం కాదని అన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గొప్ప పాలన అందిస్తామని చెప్పారు. కక్ష సాధింపుల వలనే వైసీపీ అధికారానికి దూరమైందని.. అలాంటి చర్యలకు కూటమి నేతలు దిగొద్దని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు హెచ్చరికలకు తగ్గట్టే.. మంత్రులు కూడా వారివారి పనుల్లో బిజీగా ఉన్నారు. అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు.